నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

 

తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ... ఉద్యమకారుడిగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (52) సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వల్ల గుండె ఆగిపోవడంతో, వైద్యులు దాదాపు ఆరు రోజుల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలించగా, అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల నడుమ అంతిమయాత్ర సాగింది.