ఐఫోన్‌ సహా యాపిల్‌ ఉత్పత్తుల ధరలు పెరిగినా కంపెనీ జోరు కొనసాగుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బలమైన వినియోగదారులు, శక్తిమంతమైన ఎకోసిస్టమ్‌, బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కంపెనీకి మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొంటున్నారు. జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయం నమోదు చేసిన తర్వాత ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ హెడ్‌ ప్రభు రామ్‌ మాట్లాడుతూ.. ఐఫోన్‌, మ్యాక్‌ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని తెలిపారు. మెమరీ చిప్‌ల ధరలు పెరిగినా లాభాలపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు. అయితే భవిష్యత్తులో పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడం కంపెనీకి సవాలుగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. సేవల విభాగం, చైనా మార్కెట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. భారత్‌లోనూ యాపిల్‌కు మరో రికార్డు త్రైమాసికం నమోదైందన్నారు. మ్యాక్‌బుక్‌ నియోకు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. సరఫరా సమస్యలు ఉన్నా ఐఫోన్‌ 17 సిరీస్‌కు డిమాండ్‌ బలంగా కొనసాగిందన్నారు. మెమరీ చిప్‌ల వ్యయాలు పెరుగుతున్నందున ఐఫోన్‌ ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేశారు.

జూన్‌ త్రైమాసికంలో యాపిల్‌ 109.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ. ఒక్కో షేరుపై లాభం 29 శాతం పెరిగి 2.02 డాలర్లకు చేరింది. భారత్‌తో పాటు అన్ని ప్రధాన మార్కెట్లలో రికార్డు స్థాయి ఆదాయం సాధించామని సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు. సరఫరా సమస్యలు, విదేశీ మారకపు ఒత్తిళ్లు ఉన్నా వృద్ధి కొనసాగిందని చెప్పారు.