ప్రముఖ నటి పాయల్ రాజ్‌పుత్ తన దివంగత తండ్రిని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆయన జ్ఞాపకాలతో రూపొందించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కన్నీటి నివాళి అర్పించారు. తన తండ్రిని ఎంతగా మిస్ అవుతున్నదీ తెలుపుతూ ఆమె రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.

"నాన్నా, మీరు లేకుండా ఏడాది గడిచిపోయింది. మాటల్లో చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. కొన్నిసార్లు ఆ ఆపరేషన్‌కు ఒప్పుకున్నందుకు బాధపడతాను. కానీ మీరు క్యాన్సర్‌ను ఓడించాలనుకున్నారని నాకు తెలుసు. మనం అనుకున్నట్లు జరగకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. అవతలి వైపు కలుద్దాం నాన్నా.. నా కోసం వేచి ఉండండి" అంటూ పాయల్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

పాయల్ తన తండ్రి గురించి బహిరంగంగా భావోద్వేగానికి గురవడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో తన కొత్త చిత్రం 'ఫస్ట్ టైమ్ 01.01.01' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పాయల్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

ఏడెనిమిది నెలల క్రితం తన తండ్రికి క్యాన్సర్ అని తెలియగానే తన కుటుంబం మొత్తం తీవ్ర వేదనకు గురైందని ఆమె తెలిపారు. "ఆ సమయం మా కుటుంబానికి చాలా బాధాకరమైనది. ముఖ్యంగా మా అమ్మ, ఆప్తులు ఎంతో కుంగిపోయారు. ఒకవైపు అమ్మను ఎలా ఓదార్చాలో, మరోవైపు నన్ను నేను ఎలా సమాధానపరుచుకోవాలో తెలియక పూర్తిగా కృంగిపోయాను. నా జీవితంలో నాన్నే నా హీరో" అంటూ ప్రెస్ మీట్‌లోనే కంటతడి పెట్టారు.

తన తండ్రి తన నటనకు అతిపెద్ద విమర్శకుడని, 'RX 100' లాంటి బోల్డ్ సినిమా చేసినా నటిగా తనను ఎంతో మెచ్చుకున్నారని పాయల్ గుర్తుచేసుకున్నారు. "ఆయన చనిపోయే ముందు కూడా నా పంజాబీ సినిమా 'ఖుష్ ఖబరీ' చూడాలని అనేవారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రశంసల మాటలు నాకు ఎంతో విలువైనవి. ఇప్పుడు ఆయన లేరు" అంటూ ఈ నెల‌ 28వ తేదీకి ఆయన మరణించి ఏడాది అవుతుందని చెబుతూ భావోద్వేగ పోస్ట్ చేశారు. పాయల్ పెట్టిన పోస్ట్ మరోసారి ఆమె తండ్రిపై ఉన్న ప్రేమను తెలియజేస్తోంది.