తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి అందుకున్న ప్రత్యేక బహుమతి గురించి నటి రాశీ ఖన్నా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ‘ధర్మన్‌’ సినిమా చిత్రీకరణలో రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న ఆమెకు ‘లివింగ్‌ విత్‌ ది హిమాలయన్‌ మాస్టర్స్‌’ అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆయన బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వెల్లడించారు.

‘ధర్మన్‌’ షూటింగ్‌ సమయంలో ఆధ్యాత్మికతపై తమ మధ్య చర్చ జరిగిందని రాశీ తెలిపారు. ఆ సందర్భంగా ఈ పుస్తకం చదివావా అని రజనీకాంత్‌ అడిగారని చెప్పారు. తాను లేదని చెప్పిన రెండు రోజులకే స్వయంగా ఆ పుస్తకం తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. అంతేకాదు, పుస్తకం చదివిన తర్వాత ప్రశ్నలు కూడా అడుగుతానని సరదాగా చెప్పారని గుర్తుచేసుకున్నారు.

గత కొన్ని వారాలుగా ఆ పుస్తకాన్ని ఎంతో ఆసక్తిగా చదువుతున్నానని రాశీ చెప్పారు. అందులోని కొన్ని పేజీలు చదివిన ప్రతిసారీ ఆలోచనలో మునిగిపోతున్నానన్నారు. మనలో చాలామంది తమ అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోయి, వేరొకరిగా మారేందుకు ప్రయత్నించడం వల్లే అంతర్గతంగా దూరమవుతున్నామనే భావన తనను బాగా ప్రభావితం చేసిందని వెల్లడించారు.

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధర్మన్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్‌, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తమిళంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.