కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం కాలేకపోవడానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ ఆయన భాషా నైపుణ్యాలపై విమర్శలు గుప్పించారు.

విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందిస్తూ, "రాహుల్ గాంధీ సహజంగా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతారు. కానీ, భారతదేశంలో రాజకీయాల్లో గెలవాలంటే ప్రజలు రోజూ మాట్లాడే భాషలో ప్రావీణ్యం ఉండాలి. రాహుల్ హిందీ వింటుంటే, ఎవరో అనువదించి చెబుతున్నట్లు ఉంటుంది" అని వివరించారు. ఆయన హిందీలో ఇంగ్లీష్ పదాలు, యాస స్పష్టంగా కనిపిస్తాయని, స్థానిక నుడికారాలు, జాతీయాలు అసలు ఉండవని పేర్కొన్నారు.

"రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో ఆలోచించి హిందీలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కారణంగానే ఆయన సామాన్య ప్రజలతో సరిగ్గా కనెక్ట్ కాలేకపోతున్నారు" అని విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల భాషలో మాట్లాడటమే రాజకీయ విజయానికి పునాది అని, ఆ విషయంలో రాహుల్ వెనుకబడ్డారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.