క్రికెట్ మైదానంలో రాజకీయ ఉద్రిక్తతలను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. భారత మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్ ఆల్రౌండర్ ఫాతిమా సనాతో ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్లో జరిగిన ఓ మ్యాచ్ అనంతరం ఈ దృశ్యం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
2025లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఈ విధానాన్ని పాటిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్ల క్రీడాకారులు సంప్రదాయం ప్రకారం ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో జెమీమా, ఫాతిమా కరచాలనం చేసుకోవడమే కాకుండా ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మైదానంలో వారిద్దరి మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. సౌత్రన్ బ్రేవ్, బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్ల మధ్య ఈ పోరు జరిగింది. జెమీమా ప్రాతినిధ్యం వహిస్తున్న సౌత్రన్ బ్రేవ్ జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇది వరుసగా నాలుగో గెలుపు కాగా, ఫీనిక్స్ జట్టు ఇంకా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో జెమీమా కేవలం 18 బంతుల్లో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మరోవైపు ఫాతిమా సనా బౌలింగ్లో 15 బంతుల్లో 33 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన సౌత్రన్ బ్రేవ్ జట్టు.. లిజెల్ లీ (43), మైయా బౌచియర్ (45) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. చివర్లో జెమీమా మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు భారీ స్కోరు అందించింది. అనంతరం ఛేదనకు దిగిన ఫీనిక్స్ జట్టు టామీ బ్యూమాంట్ (22), డవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) శుభారంభం అందించినా, వారిద్దరూ ఔటయ్యాక మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి ఫీనిక్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎల్లీస్ పెర్రీ (16), ఫాతిమా సనా (5) అజేయంగా నిలిచారు
ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్లో అరుదైన ఘటన.
