దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ప్రధాన అంతర్జాతీయ టోర్నీలో పతకం గెలిచిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తన మనసులోని మాటను బయటపెట్టాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో రజత పతకం సాధించిన తర్వాత మాట్లాడిన అతడు.. ఎక్కడ గాయం తిరగబెడుతుందేమోనన్న భయం ప్రతి త్రోకు ముందు వెంటాడిందని వెల్లడించాడు. అయినప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించి దేశానికి పతకం అందించడం ఆనందంగా ఉందని చెప్పాడు.

పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌.. సీజన్‌లో అత్యుత్తమంగా 85.83 మీటర్లు విసిరి రజత పతకం సాధించాడు. శ్రీలంక అథ్లెట్‌ రుమేశ్‌ తరంగా పతిరాగే 89.75 మీటర్ల భారీ త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్‌ యశ్‌వీర్‌ సింగ్‌ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకం దక్కించుకున్నాడు.

పోటీ అనంతరం నీరజ్‌ మాట్లాడుతూ.. తన పునరాగమనం సానుకూలంగా సాగుతోందని తెలిపాడు. చలి వాతావరణంలో తన ప్రదర్శన అంతగా ఉండదని, తాను భారతీయుడినని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. అయినా మళ్లీ పతకాల వేదికపై నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. తాను చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోందని చెప్పాడు.

గాయం పూర్తిగా నయం కాకపోవడం వల్ల ప్రతి త్రోకు ముందు భయపడ్డానని నీరజ్‌ వెల్లడించాడు. ‘‘100 శాతం ఫిట్‌గా ఉంటే ఎంతటి సవాలునైనా ఎదుర్కోగలమన్న ధైర్యం ఉంటుంది. కానీ గాయం ఉంటే భయం వెంటాడుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. చాలా వేగంగా పరుగెత్తకుండా శరీరాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించాను. అయినా నా త్రో బాగానే వచ్చింది’’ అని వివరించాడు.

ఈ పోటీలో తనకు కూడా ఒక్క మంచి త్రో మాత్రమే వచ్చిందని నీరజ్‌ చెప్పాడు. మిగతా ప్రయత్నాల్లో జావెలిన్‌ ఆశించిన విధంగా వెళ్లలేదని పేర్కొన్నాడు. విజేత రుమేశ్‌ తరంగా కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే స్వర్ణం సాధించాడని గుర్తు చేశాడు. ఇకపై జరిగే పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.