హైదరాబాద్ మెట్రో రైలు అత్యవసర అవయవ మార్పిడి కోసం ప్రత్యేక 'గ్రీన్ ఛానెల్'ను ఏర్పాటు చేసి, ప్రాణాలను కాపాడే బృహత్కార్యంలో కీలక భాగస్వామిగా నిలిచింది. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు సజీవ అవయవాలైన గుండె, ఊపిరితిత్తులను మెట్రో ద్వారా అత్యంత వేగంగా తరలించారు.

గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి ఈ అవయవాలను తరలించాల్సి ఉండగా, రోడ్డు మార్గంలోని ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్య బృందం మెట్రో అధికారుల సహకారం కోరింది. దీనిపై తక్షణమే స్పందించిన అధికారులు ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. ఫలితంగా దాదాపు 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే అధిగమించి, అవయవాలను సురక్షితంగా కిమ్స్ ఆసుపత్రికి చేర్చారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి అత్యవసర వైద్య సేవలకు, ప్రాణ రక్షణ చర్యలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మెట్రో రైలు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. కీలక సమయంలో మెట్రో అధికారులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.