ఈ ఏడాది దీపావళికి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణ్‌', జపాన్ పాప్యులర్ ఫ్రాంచైజీ 'గాడ్జిల్లా మైనస్ జీరో' ఒకే రోజున, అంటే నవంబర్ 6న విడుదల కానున్నాయి. ఒకవైపు భారతీయ ఇతిహాసం, మరోవైపు గ్లోబల్ మాన్స్టర్ ఫ్రాంచైజీ తలపడుతుండటంతో ఈ సినిమా వార్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా 'రామాయణ్‌' చిత్రబృందం ఓ ఇంగ్లీష్ ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. దీపావళి పండుగను లక్ష్యంగా చేసుకుని, ధన్‌తేరాస్ పర్వదినమైన నవంబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శుక్రవారం ప్రారంభమై, వారాంతం, ఆ తర్వాత గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ వంటి వరుస సెలవులు ఉండటంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద 'రామాయణ్‌'కు భారీ వసూళ్లు దక్కే అవకాశం ఉంది.

స్వదేశంలో 'రామాయణ్‌' హవా నడిచినా, విదేశీ మార్కెట్లలో మాత్రం గట్టి పోటీ తప్పేలా లేదు. జపాన్‌కు చెందిన 'గాడ్జిల్లా మైనస్ జీరో' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. దీని ముందు భాగం భారీ విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. దీంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఈ రెండు సినిమాల మధ్య ప్రధాన పోటీ ఐమ్యాక్స్, ఇతర ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్‌ల కోసమే జరగనుంది. ఇప్పటికే 'గాడ్జిల్లా మైనస్ జీరో' ఐమ్యాక్స్ విడుదలను ఖరారు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు 'రామాయణ్‌' చిత్రాన్ని కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనే చిత్రీకరించారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి భారీ తారాగణంతో వస్తున్న 'రామాయణ్‌', గ్లోబల్ మాన్స్టర్‌గా పేరున్న 'గాడ్జిల్లా' మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.