కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఘటనపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఆయన ఈరోజు మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్... క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అక్రమ మార్గాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కోట్ల రూపాయలు, బ్లాంక్ చెక్కులు చూపించినా లొంగకపోవడంతోనే తమపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులకు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక చట్టం, అధికార పార్టీ నేతలకు మరొక చట్టం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
