జాతీయ చేనేత దినోత్సవం వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక ధీమానిచ్చిన ‘నేతన్న బీమా’, ‘నేతన్నకు చేయూత’ వంటి గొప్ప పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి నేతన్నలను కోలుకోలేని దెబ్బతీసిందని తన లేఖలో ఆయన మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫారాల తయారీ ఆర్డర్లను పక్కనబెట్టి, కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

 

ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.18 వేల ఆర్థిక సాయం, రూ.లక్ష వ్యక్తిగత రుణమాఫీ, 5 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బోర్డులను రద్దు చేసి, జీఎస్టీ విధించి దెబ్బతీస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పథకాలను నిలిపివేసి నేతన్నలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత వైఖరి వీడి, రద్దు చేసిన పథకాలను తక్షణమే పునరుద్ధరించి నేతన్న కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.