యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రశంసలు కురిపించారు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గొప్ప విషయమని అన్నారు. షాట్లు ఆడే నైపుణ్యం ఉండటం ఒకటైతే.. వాటిని ఆడే ధైర్యం ఉండటం మరో విషయమని చెప్పారు.

‘‘వైభవ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 15 లేదా 16 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయికి చేరడం చాలా గొప్ప విషయం. ఐపీఎల్‌లోనూ అతడు అద్భుతంగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు కొట్టే విధానం ఆకట్టుకుంటోంది. నైపుణ్యం ఉండటం ఒక విషయం. కానీ 15 ఏళ్ల వయసులోనే ఆ షాట్లు ఆడే ధైర్యం ఉండటం చాలా ప్రత్యేకం’’ అని ధావన్‌ అన్నారు.

ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల్లో వైభవ్‌ 151 పరుగులు చేశాడు. దీంతో తొలిసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 3-0తో గెలిచింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్‌.. టీమిండియా తరఫున ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున వైభవ్‌ 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఎమర్జింగ్‌ ప్లేయర్‌, మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ సహా పలు అవార్డులు గెలుచుకున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ 439 పరుగులతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా నిలిచాడు.

ఇదిలా ఉండగా.. ధావన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పితంపురలో ఓ పాఠశాలలో STEM ల్యాబ్‌ను ప్రారంభించారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితంపై విద్యార్థులకు ప్రాక్టికల్‌ అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ఈ ల్యాబ్‌తో 2,500 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. డిజిటల్‌ విద్యా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 50 వేల మంది పిల్లలకు తమ ఫౌండేషన్‌ చేరువైందని ధావన్‌ తెలిపారు.