తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' విడుదలకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్‌ను పొందింది. స్వాతంత్య్ర దినోత్సవ వారాంతాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

'లక్కీ భాస్కర్' వంటి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య.. సంజయ్ విశ్వనాథ్ అనే 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లో సూర్య స్టైలిష్ లుక్, అతడి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, స్టైల్, టైమింగ్ కామెడీ, భావోద్వేగాలను మిళితం చేస్తూ అతడి పాత్రను తీర్చిదిద్దిన విధానంపై ప్రశంసలు వస్తున్నాయి.

'విశ్వనాథ్ & సన్స్' చిత్రంలో సూర్య సరసన 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కూడా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి. ఓవరాల్ గా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'విశ్వనాథ్ & సన్స్' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.