శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆందోళనలు చేపడుతున్న యువత సమస్యలను పట్టించుకోని ప్రధాని, తమ పార్టీ నుంచి ఫిరాయించిన ద్రోహులతో సమావేశమయ్యేందుకు మాత్రం సమయం కేటాయించారని ఆయన ఆరోపించారు.

శనివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, అంతకుముందు రోజు ఎన్డీయే కూటమితో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ అనంతరం, ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఆరుగురు నూతన ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో శివసేన వర్గాల పిటిషన్లపై విచారణ జరుగుతున్న తరుణంలో, న్యాయస్థానాన్ని భయపెట్టేందుకే ఈ భేటీని ఏర్పాటు చేశారా? అని ఆయన ప్రశ్నించారు.

"యువతను కలిసేందుకు ప్రధానమంత్రికి సమయం లేదు కానీ, ద్రోహులతో సమావేశమవుతారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. మీరు సుప్రీంకోర్టును భయపెట్టాలని చూస్తున్నారా?" అని ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగానే వస్తుందన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో ప్రస్తుతం 'తుపానుకు ముందు ప్రశాంతత' నెలకొందని ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. జెన్ జీ నిరసనలు ప్రభుత్వాన్ని కదిలించాయని, అయితే వారికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం పోలీసు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాలనలో మార్పుకు సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా వేదికల ద్వారానే పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు.