విజయవాడ సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఏకంగా కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా.. చనిపోయిన వాడు కాపు, చంపినవాడు కాపు అని సీఎం స్థాయి వ్యక్తి కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడటం అత్యంత దారుణం. ప్రభుత్వం చేసిన హత్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుల ముద్ర వేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు" అని మండిపడ్డారు.
ఈ కేసు కేవలం ఒక సీఐ చేసిన చర్యగా చూపించి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని గుడివాడ ఆరోపించారు. "ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే వరకు సాయికృష్ణ చనిపోయిన విషయాన్ని దాచారు. ఈ కేసులో కేవలం కింది స్థాయి పోలీసులను కాకుండా... డీజీపీ, డీజీ, ఏసీపీలను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం వేసిన సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావు. దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలి" అని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. "పోలీసులు చట్టానికి లోబడి పని చేయండి. రేపటి రోజున మిమ్మల్ని కాపాడేందుకు చంద్రబాబు, లోకేష్ రారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఇక మిగిలిన కాలంలో సినిమా దద్దరిల్లిపోతుంది. ఇది పాత కాలం కాదు, ఇంటర్నెట్ యుగం. వైసీపీ ముందు చంద్రబాబు డ్రామాలు అస్సలు చెల్లవు. హోంశాఖ సరిగా పనిచేయడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారు" అని గుర్తు చేశారు. కాపుల సమస్యలపై సమావేశం పెట్టుకుంటే దాన్ని పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
