ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవలే ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు గోవాలో హాజరయ్యారు. ఇంతలోనే తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భాగ్యరాజ్గా జన్మించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా, కథా రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మధ్యతరగతి కుటుంబాల జీవనశైలిని ప్రతిబింబించే కథలు, సహజమైన సంభాషణలు, భావోద్వేగాలతో కూడిన చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు.
కెరీర్లో 25కు పైగా చిత్రాలకు భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. 75కిపైగా సినిమాల్లో నటించారు. ముందానై ముడిచ్చు, అంధా 7 నాట్కల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ వంటి చిత్రాలు ఆయనకు చిరస్థాయి గుర్తింపు తెచ్చాయి. తెలుగులోనూ కుబేర, 35, సీత, రెడ్ అలర్ట్, మేం వయసుకు వచ్చాం వంటి చిత్రాల్లో మెరిశారు.
హిందీలోనూ ఆఖ్రీ రాస్తా చిత్రానికి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. భాగ్యరాజ్ సేవలను గుర్తించిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్.. సినీ రంగంలో తన వారసుడిగా ఆయనను ప్రశంసించడం విశేషం.
భాగ్యరాజ్కు భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య ఉన్నారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత...
