తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) ఉదయం మీడియాతో మాట్లాడుతూ... 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి చర్యలు పూర్తి అయ్యాయన్నారు. 11శాతం పీఆర్సీ జులై జీతాల నుంచే అమలు చేయనున్నట్లు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామన్నారు. విలీన కమిటీలో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పిస్తామని చెప్పారు.
గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాతే విలీన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విలీన ప్రక్రియపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఎన్నికల నోడల్ అధికారిగా జేఎల్సీ సునీత నియామకం జరిగిందన్నారు. ఏపీ తరహా ఇబ్బందులు రాకుండా విలీన విధివిధానాలను రూపొందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
