ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈరోజు(శనివారం) పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా వర్షపు నీరు చేరింది.

ఇదిలా ఉండగా, రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తోంది. రాజమండ్రి నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. సాగులో ఉన్న పంటలకు తగినంత తేమ అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.