శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. తమ సార్వభౌమాధికారంపై జరిగే ఏ దాడినీ ఉపేక్షించబోమని, ఈ చర్యకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది.

ఇటీవల హోర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌కు చెందిన డ్రోన్, దాడి చేసినట్టు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర రాడార్ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి దాడులు చేయడం అమెరికా నిజమైన ఉద్దేశాలను బయటపెడుతోందని వ్యాఖ్యానించింది.

ఒప్పంద ఉల్లంఘన అమెరికాకే నష్టం కలిగిస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలు ఇకపై తమ నిబంధనలనే పాటించాలని స్పష్టం చేసింది. కాగా, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు చేసి, ముందుగా ఇరానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేశారు.