భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాన సనాయే తకాయిచి జులై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో నిర్వహించనున్న 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో ఇరు దేశాల ప్రధానులు పాల్గొంటారు. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సనాయే తకాయిచి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 

వాస్తవానికి, ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు చిహ్నంగా ఈ సదస్సును గౌహతిలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ప్రధాని తకాయిచి పర్యటన షెడ్యూల్ మరియు ఇతర లాజిస్టికల్ కారణాల రీత్యా వేదికను ఢిల్లీకి మార్చినట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏడాది టోక్యోలో జరిగిన 15వ సదస్సుకు కొనసాగింపుగా ఈ సమావేశం జరగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత, కీలక ఖనిజాలు, ఇంధన సరఫరా వ్యవస్థల బలోపేతం మరియు రక్షణ రంగ సహకారం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండే అవకాశం ఉంది.