చదువు కోసం భారత్‌కు వచ్చిన ఓ అమెరికన్ యువకుడు, ఇక్కడే ఏకంగా రూ.190 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కేవలం 22 ఏళ్ల వయసులో భారత్‌కు వచ్చిన బెర్ట్ ముల్లర్, దశాబ్ద కాలంలోనే దేశంలోని అతిపెద్ద మెక్సికన్ రెస్టారెంట్ చెయిన్‌లలో ఒకటైన 'కాలిఫోర్నియా బురిటో'ను స్థాపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 103 అవుట్‌లెట్లతో విస్తరించిన ఈ సంస్థ, 2024 ఆర్థిక సంవత్సరంలో 23 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.190 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది.

2010లో, 22 ఏళ్ల బెర్ట్ ముల్లర్ అమెరికా నుంచి జైపూర్‌కు ఒక స్టడీ ప్రోగ్రామ్‌లో భాగంగా వచ్చాడు. ఇక్కడ ఒక ఆతిథ్య కుటుంబంతో కలిసి నివసిస్తున్నప్పుడు, తాను వండిన అమెరికన్ వంటకాల కన్నా మెక్సికన్ మూలాలున్న తన క్లాస్‌మేట్ చేసిన వంటకాలను వారు ఎక్కువగా ఇష్టపడటాన్ని గమనించాడు. అదే అతడిలో వ్యాపార ఆలోచనకు బీజం వేసింది. 

వారు మెక్సికన్ వంటకాలైన చిప్స్, సల్సా, బీన్స్‌ వంటి వాటిని ఎంతో ఇష్టంగా తినడాన్ని ఆయన గమనించారు. భారత్‌లో మెక్సికన్ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంటుందని నమ్మారు. "భారత్‌కు మెక్సికన్ తరహా ఆహార సంస్కృతిని పరిచయం చేయవచ్చనే ఆలోచన ఆ రోజే నాలో మొలకెత్తింది" అని ముల్లర్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

2011లో అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చిన ముల్లర్, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుంచి సుమారు 2,50,000 డాలర్ల నిధులను సమీకరించారు. అనంతరం 2012లో బెంగళూరులో మొట్టమొదటి 'కాలిఫోర్నియా బురిటో' అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. విదేశీ ప్రయాణాలు చేసే టెక్ నిపుణులు బెంగళూరులో అధికంగా ఉండటం, ఆయన వ్యాపార విస్తరణకు సరైన వేదికగా నిలిచింది.

అయితే, ఈ విజయ ప్రయాణంలో ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఒక సీనియర్ ఉద్యోగి అక్రమాలకు పాల్పడటం, సరఫరాదారులు అధిక ధరలు వసూలు చేయడం వంటి సమస్యలు తలెత్తాయి. అంతేకాకుండా, అవకాడో పండ్ల సాగులో వాతావరణ పరిస్థితులు, వన్యప్రాణుల బెడద వంటి ఇబ్బందులను కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ముల్లర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. "మా అమ్మ ఒక మారథాన్ రన్నర్, ఆ పట్టుదల నాలోనూ ఉంది. లక్ష్యాన్ని చేరే వరకు నిరంతరం శ్రమించాలి. వ్యాపారాన్ని వదిలేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు" అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సున్న ముల్లర్ పూర్తిగా భారత్‌లోనే స్థిరపడ్డారు. స్థానిక రైతుల నుంచి ముడిసరుకులను సేకరించడంతో పాటు, స్వయంగా వందలాది అవకాడో చెట్లను నాటారు. "నేను భారత్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇండియా ఇప్పుడు నా సొంత ఇల్లులా మారిపోయింది" అని ముల్లర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.