పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిరసనలపై పాకిస్థాన్‌ భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరించడంతో 50 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయపడినట్లు స్థానిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

‘జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ’ (జేఏఏసీ) సభ్యుడు సర్దార్‌ ఉమర్‌ నజీర్‌ కశ్మీరీ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందిస్తూ, గత నాలుగు రోజుల్లో భద్రతా బలగాల చర్యల్లో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ముజఫరాబాద్‌ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. ప్రజలు తమ మౌలిక హక్కుల పరిరక్షణతో పాటు స్థానిక అధికారులు ఇచ్చిన హామీల అమలును కోరుతున్నారని జేఏఏసీ వెల్లడించింది.

అమెరికాకు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ఆర్‌ఎఫ్‌) కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. నిరాయుధ, శాంతియుత నిరసనకారులపై పాకిస్థాన్‌ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. స్థానిక పౌరసమాజ సంస్థల సమాచారం ప్రకారం.. ఆధారాలు దాచిపెట్టేందుకు ఆసుపత్రుల నుంచి మృతదేహాలను తొలగించడంతో పాటు ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపించింది. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వల్ల స్వతంత్ర సమాచారం బయటకు రావడం కష్టంగా మారిందని తెలిపింది.

మరోవైపు యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ (యూకేపీఎన్‌పీ) ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అధికారులను కలిసి పీవోకేలో జరుగుతున్న పరిణామాలను వివరించింది. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగాన్ని వెంటనే నిలిపివేయాలని, మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలని, అదృశ్యమైన వారిపై వివరాలు వెల్లడించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేసింది.