దేశంలో ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు ప్రక్రియ మరోసారి భారీ స్థాయిలో నమోదైంది. 2026-27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి జులై 31 గడువు ముగిసే సమయానికి 5.9 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపన్ను శాఖ శనివారం వెల్లడించింది. గడువులోగా రిటర్నులు సమర్పించిన పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలిపింది.

సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆదాయపన్ను శాఖ స్పందిస్తూ.. ‘‘పన్ను చెల్లింపుదారుల విశ్వాసం, సకాలంలో నిబంధనలు పాటించడం భారత ఆర్థికాభివృద్ధికి శక్తినిస్తోంది’’ అని పేర్కొంది. గడువు చివరి రోజైన జులై 31న ఒక్కరోజే 40 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఆడిట్‌ అవసరం లేని వ్యక్తులు, సంస్థలకు జులై 31 చివరి తేదీ కావడంతో చివరి రోజున భారీ సంఖ్యలో రిటర్నులు సమర్పించారు.

గడువు సమీపించే కొద్దీ ఐటీఆర్‌ల దాఖలు వేగం గణనీయంగా పెరిగింది. జులై 11 నాటికి 1.7 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు కాగా.. జులై 22 నాటికి ఆ సంఖ్య 3 కోట్లకు చేరింది. జులై 27 నాటికి 4 కోట్ల మార్కు దాటగా, జులై 31న 5 కోట్లను అధిగమించింది. చివరకు గడువు ముగిసే సమయానికి 5.9 కోట్లకు పైగా ఐటీఆర్‌లు నమోదయ్యాయి.

చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని ఆదాయపన్ను శాఖ పలుసార్లు పన్ను చెల్లింపుదారులను కోరింది. ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌పై అధిక భారం, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది.

2026-27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సవరించిన ఐటీఆర్‌ ఫారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఇప్పటికే విడుదల చేసింది. దీర్ఘకాలిక మూలధన లాభాలు, షేర్‌ బైబ్యాక్‌ల వల్ల కలిగిన నష్టాలు, కొన్ని ట్రేడింగ్‌ లావాదేవీలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు కాగా, రూ.4.35 లక్షల కోట్లకు పైగా ఆదాయపన్ను రిఫండ్‌లు జారీ చేసినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది.