తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 2017 నాటి నేరెళ్ల ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన పట్ల సిగ్గుతో తలదించుకుంటున్నానని పేర్కొంటూ, తెలంగాణ సమాజానికి ఆమె బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాడతానని ప్రకటించిన కవిత, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు జరిగిన దాడిలో బాధితుడైన గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఇసుక అక్రమ రవాణాను నిరసించినందుకు నేరెళ్లలో జరిగిన దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉదంతం. ఆనాడు పాలించిన కుటుంబ సభ్యురాలిగా ఈ ఘటన పట్ల సిగ్గుపడుతూ క్షమాపణలు కోరుతున్నాను" అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
నేరెళ్ల ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా, అందుకు కారకులైన పోలీసులు, ఇతర బాధ్యులకు ఎందుకు శిక్షలు పడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్లను ఆమె నిలదీశారు. బాధితుల పేరు చెప్పి ఓట్లు పొందిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారని విమర్శించారు.
బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఎస్సీ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని, లేనిపక్షంలో సీఎంవో లేదా అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగుతామని కవిత హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన ఆమె, కేటీఆర్ సైతం బాధ్యతగా బాధితుల పిల్లల చదువుల ఖర్చును భరించాలని కోరారు.
ఇటీవల మరణించిన బాధితుడు గోపాల్ కుటుంబాన్ని పరామర్శ:కవిత..
