పాఠశాల విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించడంతో పాటు భోజనాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం ఒక కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకసారి ‘చికెన్ బిర్యానీ’ అందించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, దేశంలోనే సుదీర్ఘకాలంగా అమలవుతున్న ఈ పథకంలో ఇదొక ముఖ్యమైన మార్పు అవుతుంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారానికి ఒకసారి ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్ బిర్యానీని అందించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో పాటు భోజనం నాణ్యతను, ముఖ్యంగా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను మెరుగుపరిచే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం తమిళనాడులో 1 నుంచి 10వ తరగతి వరకు సుమారు 40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా 1 నుంచి 8వ తరగతి వరకు 32 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతోంది.
ఈ రెండు పథకాలను 11, 12 తరగతులకు కూడా విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల మరో 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. హయ్యర్ సెకండరీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి హాజరు మెరుగుపడి, డ్రాపవుట్లు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇలాంటి పథకాలకు మార్గదర్శకంగా నిలిచిన తమిళనాడు, చికెన్ బిర్యానీ ప్రతిపాదనతో మరో ముందడుగు వేసినట్టు అవుతుంది.
తమిళనాడు మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ వారానికి ఒకసారి అందించేందుకు ప్రభుత్వ పరిశీలన..
