జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక భారీ అంతర్జాతీయ కుట్రను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బెంగాల్, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ప్రముఖ రాజకీయ నాయకులను, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను హనీట్రాప్ చేసి ముగ్గులోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్న సంచలన నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో ఝార్ఖండ్కు చెందిన అర్పితా సర్కార్ అనే మహిళతో పాటు ఆమె భాగస్వామి హమీమ్ మోండల్ను పూర్బా బర్ధమాన్ జిల్లాలోని వారి అద్దె ఇల్లు నుంచి ఎస్టీఎఫ్ దళాలు శుక్రవారం అరెస్ట్ చేశాయి.
ప్రముఖ రాజకీయ నాయకులను హనీట్రాప్ చేయడం ద్వారా రహస్య సమాచారాన్ని సేకరించడంతో పాటు, వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ ముఠా రంగంలోకి దిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్ల ఆధారంగా... వారు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి బర్ధమాన్ పర్యటనకు సంబంధించిన కీలక సమాచారాన్ని, కదలికలను నిరంతరం సేకరిస్తున్నట్లు గుర్తించారు.
నిందితులు గత ఏడాది కాలంగా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్స్టర్ షెహజాద్ భట్టీ, అజ్మల్ గుజ్జర్ నడుపుతున్న జైషే మహమ్మద్ మాడ్యూల్తో సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్లో ఉన్నట్లు ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల విక్రయాల ద్వారా వచ్చే డబ్బును పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు ఉపయోగిస్తున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈ కేసును అత్యంత సున్నితమైన జాతీయ భద్రతా అంశంగా బెంగాల్ ఎస్టీఎఫ్ పరిగణిస్తోంది. నిందితుల నుంచి లభించిన ఆధారాల ఆధారంగా ఈ నెట్వర్క్లో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
