ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్‌ ఇండియాకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. '100 శాతం' అంటూ ప్రచారం చేస్తున్న కొన్ని ఉత్పత్తుల విక్రయాలను నిలిపేయాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ జారీ చేసిన ఆదేశాలపై కోర్టు శుక్రవారం స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే ఆగస్టు 24 వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

డాబర్‌కు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా ఇలాంటి నిషేధాజ్ఞలు జారీ చేయడం సరైన విధానం కాదని జస్టిస్‌ అమిత్‌ మహాజన్‌ అభిప్రాయపడ్డారు. ఈ దశలో డాబర్‌ వాదనల్లో ప్రాథమికంగా బలం కనిపిస్తోందని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.

తేనె, ఆవు నెయ్యి, వంట నూనెలు, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, కొబ్బరినీళ్లు తదితర ఉత్పత్తులపై '100 శాతం నేచురల్‌', '100 శాతం ప్యూర్‌', '100 శాతం ప్యూరిటీ గ్యారంటీ', '100 శాతం ఆర్గానిక్‌', '100 శాతం టెండర్‌ కొబ్బరి నీళ్లు' వంటి ప్రచారాలు నిబంధనలకు విరుద్ధమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పేర్కొంది.

డాబర్‌ హిమాలయన్‌ ఆర్గానిక్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, డాబర్‌ ఆర్గానిక్‌ హనీపై జైవిక్‌ భారత్‌ లోగో వినియోగంపైనా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం తెలిపింది. అలాగే డాబర్‌ హోమ్‌మేడ్‌ కొబ్బరిపాలపై '100 శాతం ప్యూరిటీ' అనే క్లెయిమ్‌ కూడా అనుమతించదగినది కాదని పేర్కొంది.

అయితే ఈ ఉత్పత్తులను దశాబ్దాలుగా విక్రయిస్తున్నామని, షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండా నిషేధం విధించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని డాబర్‌ కోర్టుకు వివరించింది. తమ ఉత్పత్తుల లేబుళ్లు అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఎప్పుడూ చేయలేదని పేర్కొంది.