భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన స్వరాష్ట్రమైన ఉత్తరాఖండ్లో భూమి కొనుగోలు చేసేందుకు సహాయం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని సోషల్ మీడియా వేదికగా కోరాడు. పంత్ విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించి, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న రిషబ్ పంత్, తాను ఢిల్లీ నుంచి తన సొంత రాష్ట్రానికి మకాం మార్చి, తన మొదటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నట్లు 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. "గత మూడేళ్లుగా సరైన స్థలం కోసం ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, స్పష్టత లేకపోవడం ఒక పీడకలలా మారింది. నా పహాడీ ప్రజల మధ్య జీవించాలని, రాష్ట్రానికి సేవ చేయాలని ఉంది" అని పేర్కొంటూ సీఎం సహాయాన్ని అభ్యర్థించాడు.
అయితే, మరో పోస్ట్లో పంత్ ఒక స్పష్టత ఇచ్చాడు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు బహుమతిగా భూమి ఇస్తే సంతోషమే అయినా, తాను మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే ధరలకే భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
పంత్ పోస్ట్పై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. 'రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ గర్వకారణం' అని ప్రశంసించారు. నిబంధనల ప్రకారం అన్ని విధాలా సహకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, వారు త్వరలోనే పంత్ను సంప్రదిస్తారని ఆయన బదులిచ్చారు.
"ప్రియమైన రిషబ్.. మీరు ఉత్తరాఖండ్కు గర్వకారణం. మీ అద్భుతమైన ప్రదర్శన, విజయాలతో మీరు దేశంలో, ప్రపంచంలో దేవభూమి పేరును ప్రకాశింపజేశారు. మీ మాతృభూమిపై మీకున్న ప్రేమ, ఇక్కడికి తిరిగి వచ్చి సేవ చేయాలనే మీ ఆకాంక్ష ఎంతో ప్రశంసనీయం. మీరు లేవనెత్తిన విషయానికి సంబంధించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వారు త్వరలో మిమ్మల్ని సంప్రదించి, నిబంధనల ప్రకారం సహకారం అందిస్తారు" అని సీఎం ధామి ట్వీట్ చేశారు.
ఉత్తరాఖండ్లో భూమి కొనుగోలుకు సాయం చేయాలని సీఎంను కోరిన పంత్..
