ఎలాన్‌ మస్క్‌కు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు పోస్టుల ద్వారా డబ్బు సంపాదించే క్రియేటర్‌ రెవెన్యూ షేర్‌ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తోంది. ఆగస్టు 7 నుంచి కొత్తగా ఈ ప్రోగ్రామ్‌లో చేరే అవకాశం కూడా మూసివేసింది.

ఎక్స్‌లో ప్రీమియం ఖాతా ఉన్న అర్హత కలిగిన యూజర్లు తమ పోస్టులకు వచ్చే స్పందన ఆధారంగా ఈ ప్రోగ్రామ్‌ ద్వారా డబ్బు పొందేవారు. ప్రస్తుత యూజర్లకు ఆగస్టు 14, 28న సాధారణ చెల్లింపులు ఉంటాయి. సెప్టెంబర్‌ 7 వరకు వచ్చిన ఆదాయానికి చివరి చెల్లింపు సెప్టెంబర్‌ 11న జరిగే అవకాశం ఉంది.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఇతరుల కంటెంట్‌ను మళ్లీ పోస్టు చేసి డబ్బు సంపాదించే ప్రయత్నాలు పెరిగాయని ఎక్స్‌ తెలిపింది. ప్రోగ్రామ్‌లో ఉన్న ప్రోత్సాహకాలు ఆశించిన విధంగా పనిచేయడం లేదని పేర్కొంది.

దీని స్థానంలో ఒరిజినల్‌ కంటెంట్‌ రివార్డ్స్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తోంది. కొత్తగా ఏదైనా చెప్పే, సొంత ఆలోచనలు పంచుకునే, విశ్లేషణ, రిపోర్టింగ్‌, వీడియోలు, ఫొటోలు, మీమ్స్‌, థ్రెడ్స్‌ వంటి కంటెంట్‌ రూపొందించే వారికి ఇందులో డబ్బు అందుతుంది. సొంత కంటెంట్‌కు వచ్చే అర్హత కలిగిన వ్యూస్‌ ఆధారంగా చెల్లింపులు చేస్తారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి చెల్లింపులు ఉంటాయి.

కొత్త ప్రోగ్రామ్‌లో చేరాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. ప్రీమియం ఎక్స్‌ ప్లాన్‌ సభ్యత్వం ఉండాలి. కనీసం 500 వెరిఫైడ్‌ ఫాలోవర్లు ఉండాలి. గత 90 రోజుల్లో వెరిఫైడ్‌ యూజర్ల నుంచి కనీసం 5 లక్షల హోమ్‌ టైమ్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ సాధించి ఉండాలి. క్రమం తప్పకుండా ఒరిజినల్‌ కంటెంట్‌ పోస్టు చేయాలి.

కొత్త ప్రోగ్రామ్‌కు తొలి చెల్లింపు ఆగస్టు 28న జరగనుంది. అర్హత పొందిన తర్వాత సెప్టెంబర్‌ 8 నుంచి చేరే పాత రెవెన్యూ షేర్‌ యూజర్లకు తొలి చెల్లింపు సెప్టెంబర్‌ 25న అందుతుంది.