డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవడానికి గతంలో 356 పిటిషన్లు వేయించిన వైసీపీ, ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో ఆందోళనలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, వారి కుట్రలకు ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

 

పదేళ్ల పాటు అభ్యర్థులు కష్టపడి కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తే, వైసీపీ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తానని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పడమే కాకుండా... తన ఐదేళ్ల పాలనలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న జగన్ వెంటనే వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అన్నారు. చరిత్రలో 2 లక్షలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు.