బుధవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను ఆచితూచి అడుగులు వేసేలా చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, 30 షేర్ల సెన్సెక్స్ 141.90 పాయింట్లు నష్టపోయి 75,867.80 వద్ద స్థిరపడింది. ఇక, నిఫ్టీ కూడా 6.55 పాయింట్ల స్వల్ప నష్టంతో 23,907.15 వద్ద ముగిసింది.

అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్యకు చర్చలు జరుగుతున్నప్పటికీ, మంగళవారం దక్షిణ ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిందన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళనలను పెంచాయి. ఈ పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాల వైపు మొగ్గు చూపడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది.

టెక్నికల్ పరంగా చూస్తే, నిఫ్టీకి 23,800 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని, ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే 23,600-23,500 స్థాయిల వరకు పతనం ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో, 24,000-24,100 శ్రేణి బలమైన నిరోధకంగా ఉందని, దీనిని దాటితేనే బుల్స్ తిరిగి పట్టు సాధించగలరని పేర్కొన్నారు.

నిఫ్టీలో ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, ఎన్టీపీసీ షేర్లు 2 శాతానికి పైగా లాభపడగా.. టాటా స్టీల్, ఇండిగో, మారుతీ సుజుకీ, టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్ కూడా లాభాలతో ముగిశాయి. సూచీలు బలహీనంగా ఉన్నప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ రాణించడం విశేషం. రంగాలవారీగా చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సూచీలు నష్టపోగా, మీడియా, మెటల్, ఆటో సూచీలు లాభపడ్డాయి.