డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో తెరకెక్కిస్తున్న ‘స్లమ్‌డాగ్-33’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

 

 

"ప్రతి ఒక్కరూ దొంగే.. ఇక్కడ మంచివాళ్లకు అస్సలు చోటు లేదు" అంటూ పూరీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీనికి తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను కూడా జోడించడంతో.. అసలు పూరీని ఇంతలా బాధపెట్టిన ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

ఈ హఠాత్ పరిణామంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో ఆయన తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ సినిమాల డిస్ట్రిబ్యూటర్లతో ఉన్న ఆర్థిక వివాదాల వల్లే పూరీ ఇలా స్పందించారా? లేక ఏదైనా వ్యక్తిగత మోసం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వాడిన ఘాటైన భాష వెనుక పెద్ద కారణమే ఉండి ఉంటుందని భావిస్తున్నారు.