ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆడబోయే మొదటి వన్డే సిరీస్ ముంగిట టీమిండియాకు ఊహించని భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా అఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కేవలం కొన్ని గంటల క్రితమే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుండి పూర్తి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందిన హార్దిక్.. అంతలోనే మళ్లీ గాయపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

గంటల వ్యవధిలోనే మారిన సీన్:
ఐపీఎల్ సమయంలో వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా... వన్డే సిరీస్ కోసం CoE లో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాడు. అక్కడ అసెస్‌మెంట్‌లో భాగంగా తన పూర్తి కోటా అయిన 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో స్పోర్ట్స్ సైన్స్ టీమ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, బుధవారం నాటి ప్రాక్టీస్ సెషన్‌లో దురదృష్టవశాత్తూ హార్దిక్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. ఈ కొత్త గాయం నుండి కోలుకోవడానికి కనీసం రెండు నుండి మూడు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో, అతడు సిరీస్ నుండి పూర్తిగా వైదొలగాల్సి వచ్చింది.

 

రోహిత్ శర్మతో కలిసి హార్దిక్ వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడనే సంతోషంలో ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఈ తాజా పరిణామం తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా హార్దిక్‌ను వన్డేల్లో ఎక్కువగా ఆడించాలని సెలక్టర్లు భావించారు. అందుకోసమే అతనికి టీ20 సిరీస్ నుండి విశ్రాంతి కూడా ఇచ్చారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా గాయంతో ఈ సిరీస్‌కు దూరం కాగా, ఇప్పుడు హార్దిక్ కూడా అవుట్ అవ్వడం జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. శనివారం నుండి ధర్మశాలలో ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్‌లో హార్దిక్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సెలక్షన్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.