ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఆయన అందుకున్న అవార్డుతో పాటు చేతికి ధరించిన విలాసవంతమైన గడియారం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. మాధవన్ ధరించిన టైటాన్ నెబ్యులా జల్సా ఫ్లయింగ్ టూర్బిలియన్ వాచ్ ధర సుమారు రూ.40.5 లక్షలు కావడం విశేషం.
నేవీ బ్లూ బంధ్గలా సూట్, ధోతీ స్టైల్ ప్యాంట్తో హాజరైన మాధవన్ లుక్కు ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. 2025లో విడుదలైన ఈ ప్రత్యేక గడియారం జైపూర్ నగర కళా, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా రూపొందించారు. డయల్పై హవా మహల్ చిత్రాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత షకీర్ అలీ పాలరాతిపై చేతితో చిత్రించారు. సహజ రంగులు, రత్నాల పొడితో రూపొందించిన ఈ డిజైన్ ప్రతి వాచ్ను ఓ ప్రత్యేక కళాఖండంగా నిలబెడుతుంది.
ఈ వాచ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే తయారయ్యాయి. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్తో రూపొందించిన ఫ్లయింగ్ టూర్బిలియన్తో పాటు జైపూర్ ఎర్రరాతి నిర్మాణాలను గుర్తు చేసే సహజ ‘రెడ్ అగేట్’ రాయిని ఇందులో ఉపయోగించారు.
పద్మశ్రీ పురస్కారం అందుకోవడం తన జీవితంలో గొప్ప గౌరవమని మాధవన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వానికి, తన పేరును సిఫారసు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వానికి అంకితం చేస్తున్నానన్నారు. తన కుటుంబానికి, తనతో కలిసి పనిచేసిన సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ గౌరవం చెందుతుందని తెలిపారు.
మాధవన్ ధరించిన వాచ్ ప్రత్యేకత... ప్రపంచంలో కేవలం 10 మాత్రమే..
