యురోపియన్ దేశంలో నెలకు రూ. 1.5 లక్షల జీతంతో సూపర్మార్కెట్ క్యాషియర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, నాగ్పూర్కు చెందిన 28 ఏళ్ల మహిళ నుంచి రూ.11 లక్షలు కాజేసిన ఘరానా మోసం పుణేలో వెలుగుచూసింది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఒక జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ బాధితురాలిని మే నెలలో పోర్చుగల్ పంపించగా, అక్కడ ఆమె పాస్పోర్టును లాక్కుని ఆమెను ఓ బీరు షాప్ యజమానికి విక్రయించారు. అక్కడ ఆమెతో బలవంతంగా పని చేయిస్తూ తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేశారు. తన పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని అడిగితే, మరింత డబ్బు డిమాండ్ చేశారు.
భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా నిందితులు మరో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తూ భర్తను బెదిరించడంతో, తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు పుణే క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో పుణే, పోర్చుగల్కు చెందిన ఏడుగురు నిందితులపై మానవ అక్రమ రవాణా, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
