ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే గగనమైపోతున్న తరుణంలో కడపకు చెందిన ఓ యువకుడు ఏకంగా 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐటీ రంగంలో అభద్రత, లేఆఫ్స్‌తో విసుగుచెంది ప్రభుత్వ కొలువులే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన, తన పట్టుదలతో అనుకున్నది సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కడప రాజారెడ్డి వీధికి చెందిన లొమడ నాగేంద్ర సాయి ఈ ఘనతను సాధించారు. ఆయన తండ్రి అశ్వనీకుమార్ ఆర్టీసీలో పనిచేసి రిటైర్ కాగా, తల్లి రాజరాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న నాగేంద్ర, పదో తరగతిలో 9.7 జీపీఏ, ఇంటర్‌లో 974 మార్కులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకుతో ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేశారు.

చదువు పూర్తయ్యాక ఐటీ ఉద్యోగంలో స్థిరపడదామనుకున్న సమయంలో కరోనా తర్వాత ఐటీ రంగంలో మొదలైన లేఆఫ్‌లు ఆయన ఆలోచనను మార్చాయి. ఉద్యోగ భద్రత కోసం 2022లో ప్రభుత్వ కొలువుల వైపు దృష్టి సారించారు. అయితే, ఆయన ప్రయాణం సులువుగా సాగలేదు. 2023లో ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమయ్యారు. 2024లో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష రాసినా, కొద్దిలో ఉద్యోగాన్ని కోల్పోయారు.

వరుస వైఫల్యాలతో కుంగిపోకుండా తనలోని లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో సిద్ధమయ్యారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు కఠోరంగా చదవడం ప్రారంభించారు. మానసిక ఉత్సాహం కోసం అప్పుడప్పుడు స్ఫూర్తిదాయక వీడియోలు చూసేవారు. ఆయన శ్రమ 2025లో ఫలించింది. ఆ ఏడాది వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో ఈఎస్‌ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) విభాగంలో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఎస్‌ఎస్‌వో)గా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా నాగేంద్ర సాయి మాట్లాడుతూ.. "ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కష్టపడి చదవడంతో పాటు ఓపిక, సహనం ఎంతో అవసరం. తొలి ప్రయత్నంలోనే విజయం రాకపోతే నిరాశ చెందవద్దు. ఓటమిని ఒక పాఠంగా తీసుకుని పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యం" అని యువతకు సూచించారు.