ఎగుమతి రంగంపై ఆసక్తి ఉన్నవారి కోసం హైదరాబాద్ వేదికగా  ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమం జరగనుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) ఆధ్వర్యంలో "ఎగుమతి అవకాశాలు - ఎగుమతి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి" అనే అంశంపై రెండు రోజుల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ఆగస్టు 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎగుమతిదారులకు అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారితో పాటు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారికి కూడా ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దారు.

ఈ శిక్షణలో భాగంగా ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్, నియంత్రణ నిబంధనలు, ట్రేడ్ ఫైనాన్స్, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ఎగుమతి ప్రోత్సాహకాలు, సరైన మార్కెట్ ఎంపిక, విదేశీ కొనుగోలుదారులను గుర్తించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తారు.

"అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించాలనుకునే సంస్థలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ మద్దతు, ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు నిబంధనలు, ఎగుమతి డాక్యుమెంటేషన్, మార్కెట్ వ్యూహాలపై ఇది స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది" అని ఫియో జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్నికృష్ణన్ కె. వివరించారు. శిక్షణలో పాల్గొనేవారు బ్యాంకు, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) అధికారులతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఫియో సర్టిఫికెట్ అందజేస్తుంది. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాల కోసం తెలంగాణ చాప్టర్ హెడ్ ఆర్. కులకర్ణిని 9848286640 ఫోన్ నంబర్‌లో లేదా kulkarni@fieo.org ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

కాగా, 1965లో భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ చేత ఫియో స్థాపించబడింది. దేశంలోని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లు, కమోడిటీ బోర్డులు, డెవలప్‌మెంట్ అథారిటీలకు ఇది అత్యున్నత సంస్థగా ప్రాతినిధ్యం వహిస్తోంది.