ఎర్ర బస్సు కూడా రాని చోటుకు ఎయిర్‌బస్ అవసరమా? అని ఎగతాళి చేసిన చోటే ఇప్పుడు విమానాశ్రయం వచ్చిందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గతంలో కొందరు ఉత్తరాంధ్రను తక్కువగా చూసి, ఇక్కడి ప్రజలను అవమానించారని ఆయన విమర్శించారు. "ఎర్ర బస్సు రాదన్నచోట ఎయిర్‌పోర్టు వచ్చింది, మన ప్రధాని మోదీ వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా!" అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాంధ్ర కలలకు ప్రధాని నరేంద్ర మోదీ రెక్కలు తొడిగారని లోకేశ్ కొనియాడారు. ప్రధాని సహకారంతోనే ఆంధ్రప్రదేశ్‌లో అనేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. నమో అంటే.. హిమ్మత్ (ధైర్యం), విశ్వాస్ (నమ్మకం), సురక్షిత్ భారత్ (సురక్షిత భారతం) అని ఆయన వివరించారు.

సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకం కానుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ ఎయిర్‌పోర్టు రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయాన్ని వేగంగా నిర్మించిన జీఎంఆర్ సంస్థను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.