వరుస భూకంపాలు వెనెజువెలాలో అంతులేని విషాదాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాగే వేల మంది ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు. సెకెన్ల వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు 250 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరో 4300 మంది గాయాలపాలైనట్టు తెలిపారు.

ఈ భూకంపాల వల్ల గల్లంతైన వారి సంఖ్య 41 వేలకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి వివరాలను గుర్తించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా వినియోగిస్తున్నారు. వేల మంది ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపాల కారణంగా రహదారులు, విద్యుత్ వ్యవస్థ, సమాచార సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 

వెనెజువెలాలో ఈ భూకంపాల ధాటికి తీర నగరమైన లా గువెరా వణికిపోయింది. అక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ నగరంలో వందకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. వీటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు చెబుతున్నారు. శిథిలాలను తొలగించడానికి చాలా సమయం పడుతోందని తెలిపారు.