బాహుబలి 3’పై మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్‌’ డాక్యుమెంటరీలో ప్రభాస్‌, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు, ఎక్స్‌ప్రెషన్స్‌ మూడో భాగం రానుందనే సంకేతాలుగా అభిమానులు భావిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్‌’ డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు.. కానీ బాహుబలి..’’ అని చెప్పగా, వెంటనే ప్రభాస్‌ మూడు వేళ్లు చూపిస్తూ చిరునవ్వు చిందించాడు. పక్కనే ఉన్న అనుష్క శెట్టి కూడా నవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివర్లో ‘అండ్‌ ది లెగసీ కంటిన్యూస్‌’ అనే సందేశం కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది.

ఈ క్లిప్‌ను చూసిన అభిమానులు ‘బాహుబలి 3 అధికారికంగా వస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గానీ, చిత్ర బృందం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

మరోవైపు ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్‌’ నాలుగు భాగాల డాక్యుమెంటరీ జూన్‌ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. బాహుబలి చిత్రాల నిర్మాణం, వాటి వెనుక కథలు, ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయాలను ఇందులో చూపించారు. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయాలు సాధించాయి. ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికీ భారీ అభిమాన వర్గం ఉంది. ఇప్పుడు మూడో భాగంపై వస్తున్న సంకేతాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.