సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'వార‌ణాసి'పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి రాజమౌళి స్వయంగా ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు. మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 

ఫ్రాన్స్‌లో జరిగిన 'ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్'లో పాల్గొన్న రాజమౌళి, ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, వారణాసిలో జరగాల్సిన ముఖ్యమైన షెడ్యూల్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవలం కథను ముందుకు నడిపే చిన్న చిన్న సన్నివేశాలను, ప్యాచ్ వర్క్‌ను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని జక్కన్న వివరించారు. ఆయన మాటలతో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు స్పష్టమైంది.

ఈ చిత్రాన్ని ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందించడంపై రాజమౌళి ఆసక్తికరమైన సాంకేతిక వివరాలు పంచుకున్నారు. ఈ కథను ఐమాక్స్ తెరపై చూస్తేనే అసలైన అనుభూతి కలుగుతుందని, అందుకే ఈ ఫార్మాట్‌ను ఎంచుకున్నామని తెలిపారు. 

అయితే, ఐమాక్స్ కోసం కథలో మార్పులు చేయలేదని, కేవలం సాంకేతిక సర్దుబాట్లు మాత్రమే చేశామని అన్నారు. సాధారణ సినిమా స్కోప్, ఐమాక్స్ రెండింటికీ అనుకూలంగా ఉండేలా 'అనోమార్ఫిక్ ఫ్రేమింగ్' అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి చిత్రీకరణ జరుపుతున్నట్లు వివరించారు. ఈ టెక్నిక్‌తో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత పని సులభంగా సాగిందని ఆయన పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తాజా ప్రకటనతో సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లయింది.