'సాక్షి' దినపత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబును లక్ష్యంగా చేసుకుని ‘బెజవాడ బాస్ బిగ్ డీల్!’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సదరు పత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్తో పాటు ఆ కథనానికి బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వివరాల్లోకి వెళితే.. గత జూన్ 30న ప్రచురితమైన ఈ కథనంలో, అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసు విచారణను కమిషనర్ ప్రభావితం చేశారని, నిందితులతో అక్రమంగా సెటిల్మెంట్ చేసుకుని లంచం తీసుకున్నారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సాక్షి పత్రిక ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై పోలీస్ కమిషనర్ సమర్పించిన లేఖను, డీజీపీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం, బీఎన్ఎస్-2023లోని సెక్షన్ 222(2), 222(4)తో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1968లోని రూల్ 17 ప్రకారం ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రాసిక్యూషన్ డైరెక్టర్ను, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది.
సాక్షి పత్రికపై న్యాయపరమైన చర్యలకు ఏపీ ప్రభుత్వం అనుమతి..
