జమ్మూకశ్మీర్‌లో వలస కూలీలపై జరిగిన ఉగ్రదాడి మరింత విషాదంగా మారింది. కుల్గాం జిల్లాలో ఇటుక బట్టీ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో కూలీ కూడా తాజాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది.

కుల్గాం జిల్లా కెల్లం ప్రాంతంలోని ఇటుక బట్టీలో పని చేస్తున్న దీపక్‌, భూపిందర్‌పై ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో దీపక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూపిందర్‌ను తొలుత సమీప ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అయితే శనివారం చికిత్స పొందుతూ అతడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలేనని అధికారులు వెల్లడించారు.

దాడి తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని దిగ్బంధించారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇటీవల అనంతనాగ్‌లో ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు హత్య చేసిన ఘటన మరువకముందే ఈ దాడి చోటుచేసుకోవడం భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళన పెంచుతోంది.

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఉగ్రవాదులపై మరింత దూకుడుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. నిందితులను తప్పకుండా పట్టుకుని శిక్షిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.