తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే స్పందించారు. క్షమాపణ మాటలకే పరిమితం కాకుండా, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో కింద వ్యాఖ్య చేశారు.

గత వారం నుంచి వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోల ద్వారా యువతను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ, తాజాగా తనపై అసభ్య పదజాలం ఉపయోగించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘తిట్లతో సమస్యలు పరిష్కారం కావు. కోర్టుల చుట్టూ తిప్పడం, వేధించడం వల్ల పరిస్థితి మారదు. దారి తప్పిన యువతకు సరైన మార్గం చూపాలి’’ అని పేర్కొన్నారు. ఇటీవల జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో తనపై, తన తల్లిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

దీనిపై స్పందించిన అభిజీత్‌ దిప్కే.. ‘‘వీడియోలో మాత్రమే క్షమిస్తారా? లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా వెనక్కి తీసుకుంటారా?’’ అని ప్రశ్నించారు. అంతకుముందు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక చట్ట సవరణపై ప్రధాని చేసిన వీడియోను కూడా దిప్కే ఎద్దేవా చేశారు.

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తర్వాత విద్యార్థులపై నమోదైన కేసుల అంశం కొత్త రాజకీయ చర్చకు దారి తీసింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. అన్ని కేసులను ఉపసంహరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తోంది. మరోవైపు నేర చరిత్ర లేని విద్యార్థులు, మైనర్లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇదే సమయంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ కూడా వివాదానికి కేంద్రంగా మారింది. అనంతరం ఆ బాలిక క్షమాపణ వీడియో విడుదల చేసింది. తన చుట్టూ ఉన్న వారి ప్రభావంతో అలా మాట్లాడానని, అది తన తొలి, చివరి తప్పు అని పేర్కొంది. అయినప్పటికీ ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడాన్ని సీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అనుచిత భాషను సమర్థించడం లేదని, అయితే అలాంటి వ్యాఖ్యలకే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు అంటున్నారు.