ముంబైలోని ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ (టిస్‌) 86వ స్నాతకోత్సవాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఆగస్టు 2న జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తూ అధికారులు అర్థరాత్రి తర్వాత విద్యార్థులకు ఈ-మెయిల్‌ పంపారు. ‘అనివార్య పరిస్థితుల’ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే క్యాంపస్‌లో నిరసనలు జరిగే అవకాశాలే అసలు కారణమని అధికారులు, విద్యార్థి ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే గౌరవ అతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు నిరసనలకు సిద్ధమవుతున్నారన్న నిఘా సమాచారం రావడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమైనట్లు సమాచారం.

ముఖ్యంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా కార్యక్రమంలో నిరసనలు జరిగే అవకాశం ఉందని యాజమాన్యం భావించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో స్నాతకోత్సవం నిర్వహిస్తే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, అతిథుల భద్రతకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అంచనా వేసినట్లు టిస్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో వందలాది మంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే విమాన, రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడంతో పాటు హోటళ్లలో గదులు కూడా రిజర్వ్‌ చేసుకున్న కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు కలిగిన అసౌకర్యంపై టిస్‌ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

ప్రయాణ, వసతి ఏర్పాట్ల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాల నుంచి వచ్చే దరఖాస్తులను ఒక్కో కేసు చొప్పున పరిశీలించి సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని టిస్‌ తెలిపింది. స్నాతకోత్సవం కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అత్యవసరంగా అవసరమైన విద్యార్థులకు తాత్కాలిక డిగ్రీ సర్టిఫికెట్లు అందజేస్తామని హామీ ఇచ్చింది.