బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మధ్య సమన్వయం లోపించిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. జెన్-జీ యువతపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముంబైలో జెన్-జీ, జెన్-ఆల్ఫా విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా దీప్కే ప్రస్తావించారు. "నిరసనలు తెలుపుతున్న జెన్-జీ యువత దేశ వ్యతిరేకులు కాదు, వారి ఆందోళనల్లో నిజాయతీ ఉంది, వారికి నిరసన తెలిపే హక్కు ఉంది" అని మోహన్ భగవత్ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి మార్గదర్శిగా ఉన్న భగవత్ మాటలను ఆ పార్టీ నాయకత్వం వినాలని హితవు పలికారు.

గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరిగినప్పుడు బీజేపీ నేత నితిన్ నబిన్ ఆందోళనకారులను 'వైరస్' అని, కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 'ఉగ్రవాదుల బీ టీమ్' అని వ్యాఖ్యానించిన విషయాన్ని అభిజిత్ దీప్కే గుర్తు చేశారు. వారి మార్గదర్శి మాటలనే బీజేపీ నేతలు ఖాతరు చేయకపోవడం సరికాదని ఆయన అన్నారు. ఈ అంశంపై మోహన్ భగవత్ నేరుగా బీజేపీ నాయకత్వంతో మాట్లాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ భిన్నమైన వైఖరులు విస్తృత సంఘ్ పరివార్‌లో ఉన్న అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. తమ పార్టీ ఏ రాజకీయ భావజాలానికి కట్టుబడి ఉండదని, కేవలం దేశం, యువతకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బృందంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.