డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. విజయవాడ ఆటోనగర్లో జరిగిన ఈ దీక్షలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోసపోయిన డీఎస్సీ అభ్యర్థుల న్యాయం కోసం, నిరుద్యోగ యువత హక్కుల కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అనుమతి తీసుకుని శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే ఉదయాన్నే 100 మంది పోలీసులు వచ్చి టెంట్లు తీసేశారంటూ దేవినేని అవినాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని... చంద్రబాబు, లోకేశ్ ల ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లు, టమాటాలు, యూరిన్ బాటిళ్లతో దాడులు చేయడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. దమ్ముంటే అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలని, మూడేళ్ల తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడం ఖాయమని హెచ్చరించిన ఆయన... నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.
