భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, ఇప్పుడు మరింత ప్రమాదకరమైన ఎత్తుగడలకు తెరలేపింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న తమ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ.. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపింది. ఇదే సమయంలో, సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి పాకిస్థాన్ ఒక చారిత్రక రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

హమాస్‌తో ఐఎస్ఐ కొత్త వ్యూహం
భారత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కావడంతో ఐఎస్ఐ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. గతంలో మాదిరిగా పెద్ద శిబిరాలకు బదులుగా, నగరాల్లో విధ్వంసం సృష్టించే ‘అర్బన్ అసాల్ట్ టాక్టిక్స్’, చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి దాడులు చేసే ‘స్మాల్ టెర్రర్ సెల్స్’పై దృష్టి సారించింది. ఇందుకోసం గాజా ప్రాంతంలో పట్టణాల్లో దాడులు చేయడంలో, ఆన్‌లైన్ ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో అనుభవమున్న హమాస్ సహాయాన్ని ఐఎస్ఐ తీసుకుంటోంది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు హమాస్‌తో శిక్షణ ఇప్పించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

‘మక్కా ఒప్పందం’.. ఇస్లామిక్ నాటోనా?
మరోవైపు, ఆగస్టు 7న మక్కా నగరంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ దేశాలు ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై సంతకాలు చేశాయి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలోని కీలక నిబంధన నాటో కూటమిలోని ‘ఆర్టికల్ 5’ను పోలి ఉంది. దీని ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా.. అది అందరిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.

భారత్‌కు సవాలుగా మారిన పరిణామాలు
ఈ పరిణామాలపై భారత సైన్యం మాజీ ఆర్మీ కమాండర్, వ్యూహాత్మక నిపుణుడు జనరల్ రాజ్‌శుక్లా (రిటైర్డ్) విశ్లేషిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. సౌదీ ఆర్థిక బలం, టర్కీ ఆధునిక సైనిక సాంకేతికత, పాకిస్థాన్ సైనిక శక్తి, అణు సామర్థ్యం ఈ ఒప్పందంతో ఏకమయ్యాయని తెలిపారు. ప్రధానంగా పశ్చిమాసియాలో ఇరాన్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందం జరిగినప్పటికీ, పాకిస్థాన్ దీనిని భారత్‌కు వ్యతిరేకంగా ఒక ‘రక్షణ కవచం’గా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 

టర్కీ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పాకిస్థాన్‌తో బంధాన్ని బలోపేతం చేసుకుంటోందని, ఇది భారత భద్రతకు సవాలుగా మారుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో, భారత్ తన చిరకాల మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో నిఘా సమాచార మార్పిడి, డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.