ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె పెద్ద కుమార్తె అవంతిక వివాహం గోవాలో అత్యంత వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాసన్తో అవంతిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలోని ఒక విలాసవంతమైన రిసార్ట్లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురు కథానాయకులు తమ సతీమణులు సురేఖ, అమల, నీరజలతో కలిసి హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన ఈ తారలంతా నూతన దంపతులతో ఫొటోలు దిగి సందడి చేశారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, నటి త్రిష కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. దీంతో 80, 90ల నాటి తారలంతా ఒకేచోట చేరిన అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఖుష్బూకు టాలీవుడ్లోని ఈ ముగ్గురు అగ్ర హీరోలతో మంచి అనుబంధం ఉంది. 'కలియుగ పాండవులు' చిత్రంతో వెంకటేశ్, ఖుష్బూ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నాగార్జునతో 'కెప్టెన్ నాగార్జున' చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించారు. ఇక, చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో ఖుష్బూ ఆయనకు సోదరిగా కీలక పాత్ర పోషించారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరందరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. వెండితెరపై ఒకరితో ఒకరు పోటీపడినా, నిజ జీవితంలో మంచి స్నేహితులుగా మెలిగే చిరు, నాగ్, వెంకీ.. తమ స్నేహితురాలి కుమార్తె వివాహంలో ఇలా ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఫ్రేమ్లో చిరు, నాగ్, వెంకీ.. ఖుష్బూ కూతురి పెళ్లిలో సందడి...
