గోల్డ్‌ మ్యాన్‌ సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు సన్నిహితుడినంటూ నమ్మించి తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించాడంటూ బాధితులు వాపోయారు. అటు బంగారం ఇవ్వక, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్య భాయ్ ఇంటికి వెళ్లారు. దీంతో తన దగ్గర ఉన్న మూడు ఐఫోన్లను ఇచ్చి వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పడంతో పాటు రూ.20 లక్షల చెక్ ఇచ్చి పంపించాడు.

అయితే, బాధితులు వెళ్లిపోయాక అత్తాపూర్ పోలీసులకు సూర్య ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి తన ఫోన్లు లాకెళ్లారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. బంగారం కోసం హియాయత్‌నగర్‌, నీలోఫర్‌లో సూర్య భాయ్‌కు బాధితులు రూ.30 లక్షలు ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. దీంతో అత్తాపూర్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును నారాయణగూడకు బదిలీ చేశారు.